Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దల సమావేశం వాయిదా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు జరప తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ భేటీ జూన్ 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరగాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, పలువురు సినీ ప్రముఖులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. దీనికి తోడు, ఈ సమావేశానికి హాజరుకావాల్సిన మరికొంతమంది ముఖ్యమైన పెద్దలు కూడా అందుబాటులో లేకపోవడంతో, ప్రస్తుతానికి ఈ భేటీని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది

ఈ సమావేశంలో ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్... నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, డీవీవీ దానయ్య, కేవీ రామారావు... నటులు నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్ దగ్గుబాటి, మంచు మనోజ్, సుమన్, ఆర్. నారాయణమూర్తి, నాని తదితరులు పాల్గొంటారని వార్తలు వచ్చాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినీ ప్రముఖులకు ఫోన్ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ భేటీకి సుమారు 35 నుంచి 40 మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యే అవకాశం ఉంది.
Chandrababu Naidu
AP CM
Tollywood
Telugu Film Industry
Andhra Pradesh
Kandula Durgesh
Film shootings
Movie Industry Meet

More Telugu News