KTR: ఫార్ములా-ఈ రేసు కేసు: కేటీఆర్‌కు మళ్ళీ ఏసీబీ నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా-ఈ రేసు నిర్వహణ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

గతంలో మే నెల 28న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరుకాలేకపోయారు. తన విదేశీ పర్యటన ముగిసిన అనంతరం విచారణకు అందుబాటులో ఉంటానని ఆయన ఏసీబీకి సమాచారం అందించారు. అంగీకరించిన ఏసీబీ, తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసును నిర్వహించారు. ఈ రేసు నిర్వహణలో సుమారు రూ.55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌తో పాటు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు వేర్వేరు తేదీల్లో విచారించి కొంత సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలోనే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని వారికి చెప్పారు. వీరితో పాటు గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను కూడా ఏసీబీ ప్రశ్నించింది. జనవరి విచారణ తర్వాత దాదాపు మూడు నెలల విరామం అనంతరం, ఇప్పుడు కేటీఆర్‌ను రెండోసారి విచారించాలని ఏసీబీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజాగా నోటీసులు జారీ చేసి, సోమవారం విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
KTR
K Taraka Rama Rao
Formula E Race
ACB
Anti Corruption Bureau
Arvind Kumar IAS

More Telugu News