బ్యాంకుల‌కు చేరిన‌ 'త‌ల్లికి వంద‌నం' ప‌థ‌కం నిధులు

  • ఏపీలో నిన్నటి నుంచి 'త‌ల్లికి వంద‌నం' ప‌థ‌కం అమ‌లు 
  • 35,44,459 త‌ల్లులు, సంర‌క్ష‌కుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌కానున్న నిధులు 
  • ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం
ఏపీ స‌ర్కార్ నిన్నటి నుంచి అమ‌లు చేసిన 'త‌ల్లికి వంద‌నం' ప‌థ‌కం నిధులు బ్యాంకుల‌కు చేరిన‌ట్లు అధికారులు తెలిపారు. గురువారం అర్ధ‌రాత్రి నుంచి ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ‌కావ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. 35,44,459 త‌ల్లులు, సంర‌క్ష‌కుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జ‌మ‌కానున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందులో రూ.13వేలు ల‌బ్ధ‌దారుల బ్యాంకు ఖాతాల‌కు, మిగ‌తా రూ.2వేల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం క‌లెక్ట‌ర్ల ఖాతాల‌కు జ‌మ చేస్తారు. 

'తల్లికి వందనం' పథకం అంటే ఏమిటి?
పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి రూ.13,000 ఇవ్వగా.. పాఠశాల/ కాలేజీ నిర్వహణ (అభివృద్ధి)కి రూ.2000 కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు.

'తల్లికి వందనం' పథకం అర్హతలు
  • దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి
  • విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి
  • విద్యార్థికి కనీసం 75శాతం హాజరు తప్పనిసరి
  • విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి
  • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు (పేదరిక రేఖకు దిగువన ఉండాలి)
  • ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు


More Telugu News