"నరేందర్... సరెండర్" అని ట్రంప్ అనగానే ప్రధాని మోదీ లొంగిపోయారు: రాహుల్ తీవ్ర విమర్శలు

Rahul Gandhi Criticizes Modi Over Trump Call and Ceasefire
షార్ట్స్‌లో చూడండి
పహల్గామ్ దాడి అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆయన విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. "మోదీజీ.. ఏం చేస్తున్నారు అని ట్రంప్ ఫోన్‌లో అడిగారు. 'నరేందర్.. సరెండర్' అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను మోదీ తు.చ. తప్పకుండా పాటించారు" అని రాహుల్ గాంధీ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ గతంలో అగ్రరాజ్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నదని గుర్తుచేశారు. "అమెరికా బెదిరింపులను కూడా లెక్కచేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్‌ను భారత్ విచ్ఛిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడింది, ఎప్పటికీ తలవంచదు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి మహనీయులంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే" అని రాహుల్ గాంధీ అన్నారు.
Go Back to Shorts
Rahul Gandhi
Narendra Modi
Donald Trump
Operation Sindoor
India
Pakistan
Congress Party
Bhopal
Indira Gandhi
US Relations

More Telugu News