యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాక్ లో రాచమర్యాదలు.. ఆరుగురు గన్ మెన్లతో సెక్యూరిటీ.. వీడియో ఇదిగో!

  • లాహోర్‌లో ఏకే-47 గన్‌మెన్లతో ఆమెకు సెక్యూరిటీ కల్పించడంపై స్కాటిష్ యూట్యూబర్ ఆశ్చర్యం
  • పాక్ గూఢచర్యం కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా
  • స్కాటిష్ యూట్యూబర్ కాలమ్ మిల్ వీడియోలో రికార్డయిన ఘటన
  • ఆమె విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక లావాదేవీలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ పర్యటనలో ఆమెకు రాచమర్యాదలు జరిగినట్లు తెలుస్తోంది. లాహోర్ లోని అనార్కలీ బజార్ సందర్శించిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు ఏకంగా ఆరుగురు గన్ మెన్లు ఏకే 47 లతో భద్రత కల్పించిన విషయం బయటపడింది. స్కాట్లాండ్ కు చెందిన ఓ యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్రా గన్ మెన్ల భద్రత మధ్య వీడియోలు తీసుకోవడం కనిపించింది. జ్యోతి మల్హోత్రాకు కల్పించిన సెక్యూరిటీపై స్కాట్లాండ్ యూట్యూబర్ ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే.. "కాలమ్ అబ్రాడ్" అనే యూట్యూబర్ స్కాటిష్ పౌరుడు కాలమ్ మిల్ గత మార్చి నెలలో పాకిస్థాన్‌లో పర్యటించారు. లాహోర్‌లోని ప్రసిద్ధ అనార్కలీ బజార్‌లో ఆయన తిరుగుతుండగా, కొందరు వ్యక్తులు తుపాకులతో కనిపించారు. వారి చొక్కాలపై "నో ఫియర్" అని రాసి ఉంది. వారితో పాటు జ్యోతి మల్హోత్రా కూడా వీడియో రికార్డ్ చేస్తూ కనిపించింది. కాలమ్ మిల్ తనను తాను పరిచయం చేసుకుని, పాకిస్థాన్‌కు రావడం ఇది ఐదోసారని చెప్పింది. జ్యోతి తాను భారతీయురాలినని పరిచయం చేసుకుంది. పాక్ ఆతిథ్యం గురించి కాలమ్ అడగగా "చాలా బాగుంది" అని జ్యోతి బదులిచ్చింది.

జ్యోతి మల్హోత్రా ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ సాయుధ వ్యక్తులు ఆమెతోనే ఉన్నారని కాలమ్ మిల్ గుర్తించారు. "ఆమె చుట్టూ ఆరుగురు గన్‌మెన్లు ఉన్నారు. అన్ని తుపాకులు ఎందుకు? అంత భద్రత అవసరమేంటి?" అని ఆయన తన వీడియోలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలమ్ మిల్ ఒంటరిగా తిరుగుతుంటే, జ్యోతి మల్హోత్రాకు ఇంత భారీ భద్రత ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సాయుధులు యూనిఫాంలో లేనప్పటికీ మఫ్తీలో ఉన్న భద్రతా సిబ్బంది అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ వీడియోతో జ్యోతి మల్హోత్రాకు పాకిస్థాన్‌ లో ఏ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయనేది తెలుస్తోంది. ఆమె పాక్‌లో ఉన్నతస్థాయి పార్టీలకు హాజరై, అక్కడి భద్రత, నిఘా అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. భారత్‌కు తిరిగివచ్చాక కూడా వారితో టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో ఆమె చెప్పినట్లు సమాచారం. అధికారులు ఆమె డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నారు.

జ్యోతి ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆదాయానికి మించి విలాసవంతమైన జీవితం గడిపినట్లు గుర్తించారు. విమానాల్లో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణించడం, ఖరీదైన హోటళ్లలో బస చేయడం వంటివి చేసినట్లు తేలింది. ఆమె పాకిస్థాన్ పర్యటన "స్పాన్సర్డ్ ట్రిప్" అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి వీఐపీ ఆతిథ్యం పొంది తిరిగివచ్చిన వెంటనే జ్యోతి చైనాకు వెళ్లారు. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరుగుతూ, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించినట్లు సమాచారం.



More Telugu News