గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న.. అగ్నిమాప‌క డీజీ నాగిరెడ్డి ఏమ‌న్నారంటే..!

  • విద్యుదాఘాతం వ‌ల్లే గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌న్న నాగిరెడ్డి
  • ఇంట్లో చెక్క‌తో చేసిన ప్యానెళ్ల వ‌ల్లే మంట‌లు వ్యాపించాయ‌ని వెల్ల‌డి
  • విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంట‌లు వ‌చ్చాయ‌న్న అగ్నిమాప‌క డీజీ
ఆదివారం ఉద‌యం చార్మినార్ స‌మీపంలోని గుల్జార్‌హౌస్‌లో చోటుచేసుకున్న‌ అగ్నిప్ర‌మాదంపై అగ్నిమాప‌క శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యుదాఘాతం వ‌ల్లే గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ఇంట్లో చెక్క‌తో చేసిన ప్యానెళ్ల వ‌ల్లే మంట‌లు వ్యాపించాయ‌ని తెలిపారు. 

విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంట‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులో ఉన్న 17 మందిని ర‌క్షించి ఆసుప‌త్రికి తరలించామని అన్నారు. నిచ్చెన ద్వారా న‌లుగురు పైనుంచి కిందికి వ‌చ్చార‌ని, భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాద నివార‌ణకు సంబంధించి ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌న్నారు. బిల్డింగ్ విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించిన మెయిన్ వ‌ద్ద నిత్యం విద్యుదాఘాతం జ‌రుగుతున్న‌ట్లు కార్మికులు చెబుతున్నార‌ని నాగిరెడ్డి తెలిపారు.  
  
కాగా, ఈ దుర్ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 17కి చేరింది. ప‌లువురు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ... మృతుల కుటుంబాలకు, క్ష‌త‌గాత్రుల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. అటు ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా సంతాపం తెలిపారు. 


More Telugu News