IPL 2025: బాంబు పేలుడు జరుపుతాం.. వీలైతే అందరినీ కాపాడుకోండి: జైపూర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, రాజస్థాన్‌లోని జైపూర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.

జైపూర్‌లోని ప్రఖ్యాత సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం నిర్వాహకులకు ఈరోజు ఉదయం 9:13 గంటలకు ఒక ఈమెయిల్ అందిందని స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఈ-మెయిల్‌లో 'ఆపరేషన్ సిందూర్' విజయాన్ని ప్రస్తావిస్తూ, "ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు జరుపుతాం. వీలైతే ప్రతి ఒక్కరినీ కాపాడుకోండి" అంటూ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ బెదిరింపు నేపథ్యంలో స్టేడియం అధికారులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు స్టేడియం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో బెదిరింపు మెయిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ హోమ్ మ్యాచ్‌లను ఇదే స్టేడియంలో ఆడుతోంది. షెడ్యూల్ ప్రకారం, మే 16వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఇక్కడే ఆడాల్సి ఉంది. బెదిరింపు ఈ-మెయిల్‌పై అధికారిక వర్గాలు అప్రమత్తమై దర్యాప్తు ముమ్మరం చేశాయి.
IPL 2025
Rajasthan
Pahalgam Terror Attack
Operation Sindoor

More Telugu News