భారత్‌లో కాగ్నిజెంట్ నియామకాలు: 20,000 ఫ్రెషర్లకు అవకాశం

ప్రముఖ అమెరికా ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారతీయ యువతకు, ముఖ్యంగా ఫ్రెషర్లకు శుభవార్తను అందించింది. ప్రస్తుత సంవత్సరంలో సుమారు 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత్‌లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో కాగ్నిజెంట్ ఒకటి.

కంపెనీ వృద్ధి ప్రణాళికలు, ఆవిష్కరణలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ భారీ నియామకాలకు సిద్ధమైనట్లు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్. ఎస్ తెలిపారు. "మా వ్యూహంలో భాగంగా ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. 

కంపెనీ టాలెంట్ పిరమిడ్‌ను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతోనే ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను తీసుకోవాలనుకుంటున్నట్లు రవి కుమార్ వివరించారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా మేనేజ్డ్ సర్వీసులకు సంబంధించిన ప్రాజెక్టులు పెరిగిన నేపథ్యంలో, అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో వేగం పెంచాలని కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో 3,36,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత త్రైమాసికంలో నియామకాలు కొంత నెమ్మదించినప్పటికీ, తాజాగా ఫ్రెషర్ల నియామకం, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ఉత్పాదకత పెంపుదల, మానవ వనరుల వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించడం అనే మూడు కీలక అంశాలపై కంపెనీ దృష్టి సారించినట్లు సీఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలో కాగ్నిజెంట్‌లో పనిచేసి మానేసిన వారిలో సుమారు 14,000 మంది ఇప్పటికే తిరిగి సంస్థలో చేరారని, మరో 10,000 మంది త్వరలో చేరనున్నారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Cognizant
Cognizant hiring
20000 jobs
India jobs
freshers jobs
IT jobs India
Ravi Kumar S
Cognizant CEO
Artificial Intelligence
Tech jobs

More Telugu News