Gaurav Bidhuri: పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఆఫ్రిదీకి భారత బాక్సింగ్ ఛాంపియన్ గౌరవ్ బిధూరి స్ట్రాంగ్ కౌంటర్

- భారత సైన్యంపై అఫ్రిది అనుచిత వ్యాఖ్యల ఆరోపణ
- 1971లో పాక్ సైన్యం లొంగుబాటును గుర్తు చేసిన బిధూరి
- ఉగ్రవాదులకు పాక్ ఇచ్చే మద్దతు ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్థాన్ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై భారత బాక్సింగ్ ఛాంపియన్ గౌరవ్ బిధూరి తీవ్రంగా స్పందించారు. అఫ్రిదికి గట్టిగా బదులిస్తూ, చారిత్రక వాస్తవాలను గుర్తు చేశారు.
పహల్గామ్ దాడి ఘటన యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, అయితే ఈ పరిణామాలపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు సరికాదని బిధూరి అన్నారు. "ఎనిమిది లక్షల మంది భారత సైనికులు ఉండి కూడా దాడిని ఆపలేకపోయారని అఫ్రిది ఒక ఇంటర్వ్యూలో అన్నట్లు తెలిసింది. కానీ, 1971లో మీ 93 వేల మంది సైనికులు మా సైన్యం ముందు ఎలా లొంగిపోయారో గుర్తుంచుకోవాలి. కాబట్టి, మా సామర్థ్యం గురించి మీరు మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు" అని బిధూరి ఘాటుగా విమర్శించారు.
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ వైఖరిని కూడా బిధూరి ప్రశ్నించారు. "మీరు ఆధారాలు అడుగుతున్నారు. అసలు మీకు మేం ఎందుకు నిరూపించాలి? ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఎలా మద్దతిస్తుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. పహల్గామ్ దాడికి పాల్పడింది నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని వారే ప్రకటించుకున్నారు" అని బిధూరి పేర్కొన్నారు.
క్రీడా స్ఫూర్తి గురించి అఫ్రిది మాట్లాడటాన్ని కూడా బిధూరి తప్పుబట్టారు. "ఇటీవల మా ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, మీ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్ను స్వయంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. క్రీడా స్ఫూర్తి గురించి మీరు మాకు చెప్పకండి. మీకు పీఎస్ఎల్ ఉంది, మాకు ఐపీఎల్ ఉంది. కానీ ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఎక్కడ ఆడుతున్నారో గమనించండి. మీరు భారత్కు వచ్చినప్పుడు బెదిరింపులు వచ్చాయని చెబుతున్నారు. కానీ ప్రపంచ ఆటగాళ్లు వస్తున్నది మా దేశానికే కానీ, మీ దగ్గరకు కాదు. పాకిస్థాన్ అంటే ఏమిటో ప్రపంచానికి బాగా తెలుసు" అని బిధూరి చురకలంటించారు.