భారత్ దాడి భయాలు: కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్

  • పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX) భారీ పతనం
  • కేఎస్ఈ-100 సూచీ 3,545 పాయింట్లు (3.09%) నష్టం
  • భారత్ సైనిక చర్య చేపట్టవచ్చన్న పాక్ మంత్రి హెచ్చరిక కారణం
  • పెట్టుబడిదారుల్లో భయాందోళనలతో అమ్మకాల వెల్లువ
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌ను కుదిపేశాయి. భారత్ రానున్న 24 నుంచి 36 గంటల్లో సైనిక చర్యకు దిగవచ్చని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి హెచ్చరించడంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు తలెత్తాయి. ఈ భయాలతో బుధవారం ట్రేడింగ్‌లో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX) భారీ నష్టాలను చవిచూసింది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి కీలకమైన కేఎస్ఈ-100 సూచీ ఏకంగా 3,545.61 పాయింట్లు (3.09 శాతం) పతనమైంది. మంగళవారం 114,872.18 వద్ద ముగిసిన సూచీ, బుధవారం 111,326.58 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.

పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ రాబోయే 24 నుంచి 36 గంటల్లో పాక్‌పై సైనిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ చేసిన ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని ఇస్మాయిల్ ఇక్బాల్ సెక్యూరిటీస్ సీఈఓ అహ్ఫాజ్ ముస్తఫా తెలిపారు. "మంత్రి ప్రకటనతో పెట్టుబడిదారులు భయపడి, ప్రస్తుతానికి ఈక్విటీల నుంచి వైదొలగి సురక్షిత మార్గాలను చూసుకుంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు.



More Telugu News