Jagga Reddy: నాడు కేసీఆర్‌తో ఆమరణ దీక్ష చేయించింది మేమే!: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana Politics Jagga Reddys Explosive Comments on KCR

  • కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి
  • కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్రంలో శాంతి, స్వేచ్ఛ నెలకొన్నాయని వ్యాఖ్య
  • కేసీఆర్ సభ విజయవంతం వెనుక కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ ఉందని వెల్లడి
  • బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాల సభలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపణ

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 2009 నాటి దీక్షపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం చేశారని, కష్టాలు పడ్డారని, అందులో ఎవరికీ అనుమానం లేదని ఆయన అన్నారు. అయితే, తెలంగాణ కోసం ఆయన దీక్ష చేస్తున్న సమయంలో ఒకానొక దశలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించిందని, ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కలిసి కోదండరాం, మంద కృష్ణ మాదిగ వంటి వారి ద్వారా ఆయనతో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగింపజేశామని తెలిపారు. తాను నిజమే చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

అందుకే సభ విజయవంతమైంది

కేసీఆర్‌కు తాము స్వాతంత్రం ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వాతంత్రం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తి సభ విజయవంతమైందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలకు సభలు నిర్వహించుకోవడానికి అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తెలంగాణ ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ పరిస్థితి లేదని విమర్శించారు. ప్రతిపక్షాలకు సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశమే ఇవ్వలేదని, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను నిర్బంధాలకు గురిచేశారని ఆరోపించారు. ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో ప్రజలకు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కూడా దక్కలేదని, కానీ తమ ప్రభుత్వం ఆ స్వేచ్ఛను కల్పించిందని తెలిపారు.

రైతుల సంక్షేమం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తోందని జగ్గారెడ్డి అన్నారు. వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించడం ద్వారా రైతులకు గత ప్రభుత్వం కంటే అధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. "ఐదు ఎకరాలు ఉన్న రైతుకు రైతుబంధు ద్వారా రూ. 75 వేలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రూ.500 బోనస్‌తో అదనంగా మరో రూ. 50 వేల వరకు లబ్ధి చేకూరుతుంది. ఇది రైతులకు సంతోషం కలిగించే విషయమే కదా" అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

రైతు రుణమాఫీ విషయంలో ఎవరు గొప్పో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు మాఫీ చేయడం గొప్పదో, లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో రూ. 22 వేల కోట్లు మాఫీ చేయడం గొప్పదో ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Jagga Reddy
KCR
Telangana
Congress
BRS
farmers
loan waiver
political news
India
Telangana politics
  • Loading...

More Telugu News