సాంకేతికతతో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ: ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్ బాబు

  • నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికత వినియోగం
  • విస్తృతంగా సీసీ కెమెరాలు, డ్రోన్ల ఏర్పాటు, ఏఐ వినియోగం
  • మహిళా డ్రోన్ పైలట్లతో నిఘా, అక్రమ రవాణాకు అడ్డుకట్ట
  • కృత్రిమ మేధతో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, నేరస్తుల గుర్తింపు
  • సైబర్ నేరాలపై అవగాహన, సిబ్బందికి ఆధునిక శిక్షణ
విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. నేరాల కట్టడిలో భాగంగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, కృత్రిమ మేధ (ఏఐ) వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు.

2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నెట్‌వర్క్ నేర పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తోందని సీపీ అన్నారు. కమ్యూనిటీ భాగస్వామ్యంతో వేలాది కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇటీవల పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సహకారంతో అపార్ట్‌మెంట్లకు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. దీనివల్ల నేరాల నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను ఛేదించడం సులభతరం అవుతుందని, మిస్సింగ్ కేసులు, దొంగతనాలు త్వరగా పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు.

నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చామని రాజశేఖర్ బాబు వెల్లడించారు. జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాతల సహకారంతో డ్రోన్లను సమకూర్చామని, వీటి ద్వారా గంజాయి, ఇసుక అక్రమ రవాణా, బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలు, కొండలు, నదీ తీర ప్రాంతాలు వంటి సులువుగా చేరుకోలేని చోట్ల నిఘా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా వీఐపీల పర్యటనల సమయంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు ఏఐ ఆధారిత కెమెరాలను ఉపయోగిస్తున్నామని సీపీ తెలిపారు. "గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైమ్" ప్రాజెక్టు ద్వారా జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపే సమయాన్ని పర్యవేక్షిస్తున్నామని, "అస్త్రం" యాప్ ద్వారా రియల్ టైంలో ట్రాఫిక్ రద్దీని విశ్లేషించి, తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బైక్ దొంగతనాల నివారణకు ఆర్‌ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు.

నేరస్తుల డేటాబేస్ ఏర్పాటు, వారి వేలిముద్రల సేకరణకు పాపిలోన్ వంటి మొబైల్ సెక్యూరిటీ చెక్ పరికరాలు వాడుతున్నామని, నాట్‌గ్రిడ్ ద్వారా వివిధ జాతీయ డేటాబేస్‌లను యాక్సెస్ చేస్తూ పాత నేరస్తులను, నాన్-బెయిలబుల్ వారెంట్ ఉన్నవారిని పట్టుకుంటున్నామని సీపీ వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలకు, ముఖ్యంగా బ్యాంకర్లు వంటి టార్గెట్ గ్రూపులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ వినియోగం ద్వారా పోలీసింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిబ్బందికి కూడా ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నామని, ఇందుకోసం ల్యాప్‌టాప్‌లు అందించడంతో పాటు సై-ట్రైన్, ఐగాట్ కర్మయోగి వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా కోర్సులు పూర్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని రాజశేఖర్ బాబు వివరించారు.


More Telugu News

Rajasekhar Babu NTR District CP Andhra Pradesh Police Crime Control Technology CCTV Cameras Drones AI in Policing Cyber Crime Awareness