Raghunandan Rao: జిన్నారంలో శివాలయం ధ్వంసం... డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు

మెదక్ జిల్లా జిన్నారం మండలంలో ఇటీవల జరిగిన శివాలయం ధ్వంసం ఘటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల వైఖరిపై ఆయన తెలంగాణ డీజీపీ జితేందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

శివాలయంపై మధ్యాహ్నం దాడి జరిగితే, పోలీసులు రాత్రి వరకు కూడా సరైన చర్యలు ప్రారంభించలేదని రఘునందన్ రావు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆలస్యం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక మదర్సా విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కానీ దాడిని నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేసిన హిందువులపై మాత్రం నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని అన్నారు.

మదర్సాలో ఉంటున్న విద్యార్థులు అక్రమ వలసదారులై ఉండవచ్చనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. వారు హిందూ దేవుళ్లు, దేవాలయాలు, హిందూ సమాజం పట్ల ద్వేషంతో ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను ఇంతవరకు బయటపెట్టకపోవడం, మదర్సా విద్యార్థుల జాతీయత, వారికి భారత పౌరసత్వం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన వారు కూడా నివసిస్తున్నారనే సమాచారం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే భాగ్యనగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగి అశాంతి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Raghunandan Rao
BJP MP
Jinnaaram Temple Attack
Telangana DGP
Medak District
Temple Vandalism
Police Inaction
Madrasa Students
Illegal Immigrants
Hyderabad

More Telugu News