నా సోదరుడు ఇంత దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదు: ఉగ్రవాది ఆసిఫ్ సోదరి

  • పహల్గాం దాడి నిందితుడు ఆసిఫ్ ఫౌజీ 'ముజాహిద్దీన్' అన్న సోదరి 
  • తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు అదృశ్యం... భద్రతా బలగాలపై అనుమానం వ్యక్తం చేసిన వైనం
  • ట్రాల్‌లో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో ఐఈడీ పేలుళ్లు, ధ్వంసం
  • భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలు ధ్వంసం
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తుల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరిని ఆసిఫ్‌ ఫౌజీ, సులేమాన్‌ షా, అబు తాలాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో, నిందితుల్లో ఒకడైన ఆసిఫ్‌ ఫౌజీ సోదరి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తన సోదరుడు ఆసిఫ్ ఇంతటి దారుణానికి పాల్పడాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆసిఫ్ ఒక 'ముజాహిద్దీన్‌' అని ఆమె పేర్కొంది. తమ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడని కూడా తెలిపింది.

దక్షిణ కశ్మీర్‌లోని ట్రాల్‌ ప్రాంతంలో ఉన్న తమ ఇంటిని కూల్చివేశారని, దీంతో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నామని ఆమె వెల్లడించింది. పహల్గామ్ ఘటన జరిగిన సమయంలో తాను అత్తగారింట్లో ఉన్నానని చెప్పింది. తన సోదరుడి ప్రమేయం గురించి తెలిసిన తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చానని, అయితే అప్పటికే తన తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు కనిపించకుండా పోయారని ఆమె వెల్లడించింది. తమ వారిని భద్రతా దళాలే అదుపులోకి తీసుకుని ఉంటాయని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. తన సోదరుడు ఇంతటి చర్యకు పాల్పడతాడని ఊహించలేదని, ఈ దాడి గురించి తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ముందస్తు సమాచారం లేదని ఆమె స్పష్టం చేసింది. 

మరోవైపు, పహల్గామ్ దాడి అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (TRF) సభ్యులుగా భావిస్తున్న ఆసిఫ్‌ ఫౌజి అలియాస్ ఆసిఫ్ షేక్‌, సులేమాన్‌ షా, అబు తాలా, ఆదిల్ థోకర్‌ అలియాస్‌ ఆదిల్‌ గురి తదితరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాల్‌లో ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్‌ల ఇళ్లలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా, అక్కడ అమర్చిన ఐఈడీలు పేలాయి. ఈ పేలుళ్ల ధాటికి ఆ ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే, భద్రతా సిబ్బంది తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీని తర్వాత, శుక్రవారం రాత్రి భద్రతా బలగాలు మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను పేల్చివేసినట్లు సమాచారం. పహల్గాం దాడి నేపథ్యంలో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.


More Telugu News