Sourav Ganguly: పాక్‌తో భార‌త్ అన్ని ర‌కాల‌ క్రికెట్ సంబంధాల‌ను తెంచుకోవాలి: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly Advocates for Severing India Pakistan Cricket Ties

  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు
  • ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న
  • భ‌విష్య‌త్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడ‌బోమ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • తాజాగా దాయాది దేశంతో క్రికెట్ విష‌య‌మై గంగూలీ కీల‌క వ్యాఖ్య‌లు

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరుదేశాలు ఒక‌రిపై ఒక‌రు పోటాపోటీగా ఆంక్ష‌లు విధించాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌విష్య‌త్తులో దాయాది దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్ర‌క‌టించారు.

తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాక్‌తో క్రికెట్ విష‌య‌మై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. పాకిస్థాన్‌తో భార‌త్ అన్ని ర‌కాల‌ క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని అన్నాడు. కోల్‌కతాలో ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ANIతో తాజాగా దాదా మాట్లాడాడు. 

"100 శాతం ఇది (పాకిస్థాన్‌తో అన్ని రకాల క్రికెట్‌ సంబంధాలను తెంచుకోవడం) చేయాలి. కఠినమైన చర్య అవసరం. ప్రతి సంవత్సరం ఇలాంటివి జర‌గ‌డం హాస్యాస్పదం కాదు. ఉగ్రవాదాన్ని సహించలేము" అని అన్నాడు. 

ఇక‌, సంవత్సరాలుగా భారత్‌, పాక్ టీ20, 50 ఓవర్ల ప్రపంచ కప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే త‌ల‌ప‌డుతున్నాయి. ఇప్పుడు గంగూలీ చేసిన వ్యాఖ్య‌లు ఈవెంట్ల‌పై ఎంత‌వ‌ర‌కు ప్ర‌భావం చూపిస్తాయో చూడాలి.

కాగా, రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 2008 త‌ర్వాత‌ నుంచి టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో మ‌న ద‌గ్గ‌ర జ‌రిగిన‌ ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. 

ఇటీవల దాయాది దేశం ఆతిథ్యం ఇచ్చిన‌ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా భార‌త జ‌ట్టు పాకిస్థాన్‌కు వెళ్లలేదు. టీమిండియా త‌న‌ అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్ కింద దుబాయ్‌లో ఆడిన విష‌యం తెలిసిందే.  

Sourav Ganguly
India Pakistan Cricket
Bilateral Series
BCCI
Rajeev Shukla
Terrorism
ICC Events
Asia Cup
Cricket Relations
India vs Pakistan
  • Loading...

More Telugu News