Om Prakash: కర్ణాటక మాజీ డీజీపీ హత్య.. భార్య, కూతురును అదుపులోకి తీసుకున్న పోలీసులు

- ఆదివారం నాడు బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని నివాసంలో ఘటన
- తల్లి, సోదరి పాత్రపై డీజీపీ కుమారుడి ఫిర్యాదు
- ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ హత్యకు సంబంధించి ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతిలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని వారి నివాసంలో ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో జరిగిన వాగ్వాదం ఈ హత్యకు దారితీసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన తండ్రి హత్య వెనుక తల్లి పల్లవి, సోదరి కృతి ప్రమేయం ఉండవచ్చని కార్తికేష్ తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. వారిద్దరూ కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని, తరచూ తన తండ్రితో గొడవపడేవారని పోలీసులకు తెలిపారు. గత వారం తన తల్లి నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ, ఓం ప్రకాశ్ తన సోదరి సరితా కుమారి ఇంట్లో ఉన్నారని, అయితే శుక్రవారం కృతి వెళ్లి ఆయన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చిందని కార్తికేష్ వివరించారు.
పొరుగువారి ద్వారా తండ్రి హత్య విషయం తెలుసుకున్న కార్తికేష్, ఇంటికి వచ్చి చూడగా కత్తులు, పగిలిన సీసా పడి ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు ఆదివారం సాయంత్రం పల్లవిని, సోమవారం కృతిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డీసీపీ సారా ఫాతిమా ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.