Sourav Ganguly: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... టీచర్లకు స్పష్టం చేసిన గంగూలీ

- బెంగాల్ లో టీచర్ నియామకాల కుంభకోణం
- ఇటీవల నియామకాలు రద్దు
- గంగూలీని కలిసిన ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు
- తమ నిరసనకు హాజరుకావాలని టీచర్ల విజ్ఞప్తి
- సున్నితంగా నో చెప్పిన గంగూలీ
పశ్చిమ బెంగాల్ పాఠశాల సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్సీ) నియామకాల కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నియామకాలు రద్దు కావడంతో ఉద్యోగాలు కోల్పోయిన 'నిష్కళంక' ఉపాధ్యాయులకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక ఊరట కల్పించింది. కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు విధుల్లో కొనసాగవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ ఉపశమనం కొన్ని షరతులకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉండగా, ఉద్యోగాలు కోల్పోయిన కొందరు ఉపాధ్యాయులు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోల్కతాలోని ఆయన నివాసంలో కలిశారు. ఏప్రిల్ 21న పశ్చిమ బెంగాల్ సచివాలయం వరకు తాము చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు హాజరు కావాలని వారు గంగూలీని ఆహ్వానించారు. అయితే, గంగూలీ అందుకు సున్నితంగా నిరాకరించారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని స్పష్టం చేశారు. ఇది తనకు ఏవిధంగానూ సంబంధం లేని అంశం అని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.