Rahul Gandhi: 'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయండి: కర్ణాటక ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ లేఖ

- విద్యా వ్యవస్థలో దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారన్న రాహుల్ గాంధీ
- అంబేడ్కర్ ఎదుర్కొన్న కష్టం మరే బిడ్డా ఎదుర్కోకూడదన్న రాహుల్ గాంధీ
- ఇలాంటి హత్యలకు ఇకనైనా ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ
విద్యావ్యవస్థలో బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కోకుండా ఉండేందుకు 'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. మన విద్యా వ్యవస్థలో నేటికీ దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటుండటం సిగ్గుచేటని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధరామయ్య కృషి చేస్తారని తాను విశ్వసిస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. కొందరు వ్యక్తులు చూపిన వివక్ష కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి యువత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలకు ఇకనైనా ముగింపు పలకాలని ఆ లేఖలో రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.