విమానాశ్రయంలో పెంపుడు కుక్కను చంపేసి విమానం ఎక్కిన మహిళ.. అమెరికాలో ఘటన
- కొలంబియా వెళ్లేందుకు పెంపుడు కుక్కతో ఎయిర్ పోర్టుకు వచ్చిన మహిళ
- కుక్కను తీసుకెళ్లడానికి అనుమతి పత్రాలులేవని అడ్డుకున్న అధికారులు
- బాత్ రూమ్ కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అలిసన్ లారెన్స్ (57) అనే మహిళ తెల్లటి షనాసర్ కుక్కతో కలిసి ఫ్లోరిడా ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. కొలంబియా విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన అలిసన్ ను అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని తీసుకెళ్లేందుకు అవసరమైన పత్రాలు ఆమె వద్ద లేకపోవడంతో అభ్యంతరం చెప్పారు. దీంతో అలిసన్ బాత్ రూమ్ కు వెళ్లి తన పెంపుడు శునకాన్ని నీళ్లలో ముంచి చంపేసింది. ఆపై ఏమీ జరగనట్టు విమానం ఎక్కి వెళ్లిపోయింది.
బాత్ రూమ్ లో శునకం కళేబరాన్ని బయటపడడంతో మెడకు ఉన్న పట్టీపై ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమానురాలు అలిసన్ గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన ఘోరం బయటపడింది. దీంతో జంతుహింస నేరం కింద ఇల్లినోయీలోని లేక్కౌంటీలో అలిసన్ ను అరెస్టు చేశారు.