పంత్ సోదరి వివాహ వేడుకలో రైనాతో క‌లిసి చిందేసిన ధోనీ.. ఇదిగో వీడియో!

  • పంత్ సోదరి సాక్షి వివాహ వేడుకకు హాజ‌రై సంద‌డి చేసిన‌ ధోనీ, రైనా
  • బాలీవుడ్ పాట 'డమా డామ్ మస్త్ కలందర్'పై డ్యాన్స్ చేసిన క్రికెట‌ర్లు
  • వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్‌ పంత్ సోదరి సాక్షి వివాహ వేడుకలకు భారత మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ, మరో మాజీ ప్లేయ‌ర్‌ సురేశ్‌ రైనాతో క‌లిసి హాజరయ్యారు. ఈ వేడుక ముస్సోరీలోని ది స‌వాయి హోటల్‌లో బుధవారం జరిగింది. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని పంత్ సోదరి ప‌రిణ‌య‌మాడారు. 

ఇక ఈ వివాహ వేడుక కోసం ధోనీ తన భార్య సాక్షితో కలిసి మంగళవారం సాయంత్రమే ముస్సోరీ చేరుకున్నాడు. పెళ్లిలో ధోనీ, రైనా సంద‌డి చేశారు. పంత్‌తో క‌లిసి వారిద్ద‌రూ బాలీవుడ్ పాట "డమా డామ్ మస్త్ కలందర్"కి చిందేశారు. దీని తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

కాగా, పంత్ ఇటీవ‌ల ముగిసిన‌ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న‌ భార‌త‌ జట్టులో సభ్యుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవ‌కాశం అత‌నికి ద‌క్క‌లేదు. ఈ టోర్నీ ముగిసిన వెంట‌నే దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన అత‌డు త‌న సోద‌రి మెహందీ, సంగీత్, హల్ది వేడుకల్లో పాల్గొన్నాడు.

ప్ర‌స్తుతం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 కోసం పంత్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇక గత నవంబర్‌లో జెడ్డాలో జ‌రిగిన మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అటు ల‌క్నో జ‌ట్టు ప‌గ్గాలు కూడా పంత్‌కే ద‌క్కాయి.  


More Telugu News