154 మంది భార‌తీయుల‌కు పాకిస్థాన్ వీసాల జారీ.. కార‌ణ‌మిదే!

  • శ్రీ క‌టాస్ రాజ్ ఆల‌యాల‌ సంద‌ర్శన కోసం భార‌తీయుల‌కు పాక్ వీసాలు
  • ఈ నెల 24 నుంచి వ‌చ్చే నెల 2 వ‌ర‌కు వారు ప‌ర్య‌టిస్తార‌ని పాక్ హైక‌మిష‌న్ వెల్ల‌డి
  • ఇరు దేశాల ప‌ర‌స్ప‌ర గౌర‌వం, మ‌త‌ సామ‌రస్యం కోసం ఇలా వీసాలు జారీ చేస్తూనే ఉంటామ‌ని వ్యాఖ్య
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న శ్రీ క‌టాస్ రాజ్ ఆల‌యాల‌ను సంద‌ర్శించేందుకు వ‌స్తున్న 154 మంది భార‌తీయుల‌కు వీసాలు జారీ చేశామ‌ని న్యూఢిల్లీలోని ఆ దేశ హైక‌మిష‌న్ శుక్ర‌వారం తెలిపింది. ఈ నెల 24 నుంచి వ‌చ్చే నెల 2 వరకు వారు అక్కడ ప‌ర్య‌టిస్తార‌ని వెల్ల‌డించింది. 

"ఇరు దేశాల ప‌ర‌స్ప‌ర గౌర‌వం, మ‌త‌ సామ‌రస్యం కోసం ఇలా వీసాలు జారీ చేస్తూనే ఉంటాం" అని హైక‌మిష‌న్ పేర్కొంది. ఈ సంద‌ర్భంగా యాత్రికులకు ఆధ్యాత్మికంగా ఫలదాయకమైన, సంతృప్తికరమైన ప్రయాణం జరగాలని భారతదేశంలో పాకిస్థాన్ వ్యవహారాల అధికారి సాద్ అహ్మద్ వారాయిచ్ ఆకాంక్షించారు.

కాగా, 1974 నాటి పాక్‌-భారత్ మతపరమైన పుణ్యక్షేత్రాల సందర్శన ప్రోటోకాల్ ప్రకారం ప్ర‌తీ ఏటా వేలాదిమంది భారతీయ యాత్రికులు వివిధ మతపరమైన ఉత్సవాలకు హాజరు కావడానికి పాకిస్థాన్‌కు వెళుతుంటారు.


More Telugu News