సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్... విచారణ వాయిదా!

Hearing on KTR petition in Supreme Court
  • ఏడుగురు ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేర్చిన కేటీఆర్
  • అసెంబ్లీ కార్యదర్శి తరపున ముకుల్ రోహత్గి వాదనలు
  • తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ లను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తన వాదనలు వినిపిస్తూ... స్పీకర్ నుంచి మరింత సమాచారం తీసుకోవడానికి కొంత సమయం కావాలని కోరారు. స్పీకర్ తో చర్చించి కోర్టుకు వివరాలను అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ... ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించింది. అయితే, ముకుల్ రోహత్గి విన్నపంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
Advertisement
KTR
BRS
Supreme Court

More Telugu News