సీఎం చంద్రబాబు వినూత్న ప్రెస్ మీట్.. ఏఐతో లైవ్ కవరేజీ

  • టెక్నాలజీ వాడకంలో సీఎం చంద్రబాబు ఎల్లప్పుడూ ముందంజలోనే
  • ఉండవల్లి నివాసంలో ఏఐ కెమెరాలతో ఏర్పాట్లు
  • సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేయించిన మంత్రి నారా లోకేశ్
అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఎల్లప్పుడూ ముందుండే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తొలిసారి కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు లేకుండానే ఏఐ వ్యవస్థతో ప్రెస్ మీట్ నిర్వహించారు. కృత్రిమ మేధ   సాయంతో ప్రెస్ మీట్ ను లైవ్ కవరేజీ అందించారు. దీనికోసం ఉండవల్లిలోని తన నివాసంలో ఏఐ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కావడంతో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేశ్ అంగీకరించలేదు. సొంత నిధులు వెచ్చించి లోకేశ్ స్వయంగా ఈ ఏర్పాట్లు చేయించారు. 

సమావేశ మందిరంలో నాలుగు కెమెరాలతో మల్టీవీడియో కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హాల్ లోకి ఎంటరైన సీఎం చంద్రబాబు.. ఇందులోని ఓ కెమెరాకు సూచనలు ఇవ్వడంతో లైవ్ ప్రారంభమైంది. చంద్రబాబు దావోస్ పర్యటన విశేషాలు చెబుతుండగా.. సీఎంను కేంద్రంగా చేసుకుని, ఆయన సెంటర్ ఫ్రేమ్ లో ఉండేలా సర్దుబాట్లు చేసుకుంటూ ఏఐ వ్యవస్థ వీడియో ఔట్‌పుట్‌ ఇచ్చింది. కాగా, ప్రెస్ మీట్ లైవ్ కవరేజీకి దాదాపు 8 మంది కెమెరామన్లు, సిబ్బంది అవసరం.. అయితే, ఏఐ వ్యవస్థ ద్వారా ఒక్కరితోనే ఈ పనంతా చక్కబెట్టవచ్చు. దీంతో ప్రెస్ మీట్ జరుగుతున్న హాల్ లో వీడియోగ్రాఫర్ల హడావుడి, అనవసర గందరగోళం తప్పుతుంది.


More Telugu News