Varra Raveendra Reddy: నాకు అన్నీ తెలుసు, అయినా చెప్పలేను.. తొలి రోజు కస్టడీలో వర్రా రవీందర్ రెడ్డి

‘నాకు అన్నీ తెలుసు.. కానీ, సమాధానాలు మాత్రం చెప్పలేను’.. ఇదీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కస్టడీలో పోలీసులకు ఇచ్చిన సమాధానం. అధికార పార్టీ నేతలపై అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్  ఫొటోలు పెట్టిన కేసులో అరెస్ట్ అయిన వర్రాను నిన్న పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ దాదాపు 30 ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. 

ఎవరి ప్రోద్బలంతో ఈ పోస్టులు పెట్టారన్న దానికి రవీందర్ రెడ్డి నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. అయితే, చాలా వరకు ప్రశ్నలకు తనకు సమాధానాలు తెలుసని, కాకపోతే చెప్పలేనని పేర్కొన్నట్టు తెలిసింది. ఆయన తరపు న్యాయవాది ఓబుల్‌రెడ్డి సమక్షంలో ఆడియో, వీడియో రికార్డు చేస్తూ విచారించారు. 

వర్రా ఆధ్వర్యంలోని మొత్తం 43 ఫేస్‌బుక్ ఖాతాలను సీజ్ చేశారు. వీటిలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు పవన్ కల్యాణ్, లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులతోపాటు షర్మిల, ఆమె తల్లి విజయ, సునీతకు సంబంధించి అసభ్యకర పోస్టులున్నాయి. 

వాటిని వర్రా ముందు ఉంచి ప్రశ్నించగా.. వాటిని తానే పెట్టినట్టు అంగీకరించినట్టు తెలిసింది. తనకు తెలియకుండా తన పేరుతో 18 నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారని చెప్పినట్టు సమాచారం. కాగా, నిన్న కస్టడీ ముగిసిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు వర్రాను తరలించారు. నేడు కూడా విచారణ కొనసాగనుంది. 
Varra Raveendra Reddy
YCP Social Media
Kadap Central Jail

More Telugu News