చైనా వైరస్ కలకలం... 1200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

  • బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో హెచ్ఎంపీవీ వైరస్ గుర్తింపు
  • హెచ్ఎంపీవీ ప్రకటనతో భారీగా నష్టాల్లోకి వెళ్లిన సూచీలు
  • 360 పాయింట్లకు పైగా నష్టపోయిన నిఫ్టీ
చైనాలో పుట్టిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్‌లో నమోదు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ప్రకటించింది. స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ ప్రకటన నేపథ్యంలో సూచీలు దారుణంగా పతనమయ్యాయి.

మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి సెన్సెక్స్ 1,220 పాయింట్లు పడిపోయి 78,002 వద్ద... నిఫ్టీ 365 పాయింట్లు పడిపోయి 23,640 వద్ద కదలాడాయి. అంతకుముందు సెన్సెక్స్ ఓ దశలో 78,000 దిగువకు పడిపోయింది. 

చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ కేసులు భారత్‌లోనూ నమోదు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో సూచీలు అంతకంతకూ పడిపోయాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. మరోవైపు, త్వరలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చైనా సహా వివిధ దేశాలపై ఆయన టారిఫ్ పెంచుతారనే ఆందోళన నెలకొంది. దీంతో జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.

Sensex
Nifty
Stock Market
China

More Telugu News