BRS: 5.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినా మేడిగడ్డకు ఏమీ కాలేదు: వినోద్ కుమార్

రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏమీ కాలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల ములుగు కేంద్రంగా ప్రకంపనలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న మేడిగడ్డ బలంగా ఉందన్నారు. వేల టీఎంసీల నీరు అక్కడి నుంచి ప్రవహిస్తోందని అయినప్పటికీ డ్యాం మిల్లీమీటర్ కూడా కదల్లేదన్నారు.

మేడిగడ్డ ప్రాజెక్టు బలంగా ఉందా? లేదా? అని ఆ సృష్టే తెలుసుకున్నట్లుగా అయిందని వ్యాఖ్యానించారు. భూకంప కేంద్రమే మేడారం, మేడిగడ్డ అటవీ ప్రాంతంలో ఉందన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేషనల్ డ్యాం సేఫ్టీ, ఇతర కారణాలు చెప్పి వాయిదా వేయకుండా... ఫిబ్రవరి, మార్చి నాటికి అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వాలని కోరారు. మిడ్ మానేరు, ఎల్ఎండీని నింపి నీటిని వదిలితే పూర్వ కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు పలు జిల్లాలకు నీటిని ఇవ్వవచ్చన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
BRS
Medigadda Barrage
Vinod Kumar
Telangana

More Telugu News