Hyderabad Metro: మెట్రో రైలు మొదటి దశ సమయంలో నా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు: ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం సమయంలో తన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని, నాడు అలా చేసిన వాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారని హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. నగరంలో మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకుందని, ఇది హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తోందన్నారు.

ముంబై, చెన్నైలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెట్రో రైలును విస్తరిస్తున్నట్లు చెప్పారు. మన నగరంలో విస్తరణ లేకపోవడం వల్ల మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించానన్నారు. మొత్తం మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేశామన్నారు. ప్రస్తుతం ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపించామన్నారు. మేడ్చల్ వైపు కారిడార్ కోసం డిమాండ్లు వస్తున్నాయన్నారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిందన్నారు. రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Hyderabad Metro
Hyderabad
NVS Reddy
Telangana

More Telugu News