ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగేలా చూడండి: చంద్రబాబును కోరిన ఐఏఎస్ అధికారులు
- ఈ నెల 16న తెలంగాణకు రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఆదేశాలు
- చంద్రబాబును కలిసిన సృజన, హరికిరణ్, శివశంకర్
- కేంద్రంతో మాట్లాడతానని వారికి చంద్రబాబు హామీ
తాము సివిల్ సర్వీసెస్కు హైదరాబాద్ చిరునామాతో దరఖాస్తు చేయడంతో తమను అప్పుడు తెలంగాణ క్యాడర్కు కేటాయించారని సృజన, శివశంకర్ సీఎంకు వివరించారు. తాను జనరల్ క్యాటగిరీలో ఎంపికైతే రిజర్వేషన్ క్యాటగిరీలో చూపించడం వల్ల తెలంగాణకు కేటాయింపు జరిగిందని హరికిరణ్ తెలిపారు. కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చినట్టు సమాచారం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ విభజనపై రెండు రోజుల క్రితం డీవోపీటీ కీలక నిర్ణయం తీసుకుంది. తమను ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగించాలన్న ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలని 11 మంది తెలంగాణలో పని చేస్తున్న అధికారులకు, తెలంగాణలో రిపోర్ట్ చేయాలని ఏపీలో పని చేస్తున్న ఐదుగురు అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులు చంద్రబాబు వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు.