కొందరు ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారు... వైసీపీ మాత్రం విషం చిమ్ముతోంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu visits Budameru
  • బుడమేరు వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు
  • గండ్లు పూడ్చిన ప్రదేశాల పరిశీలన
  • వైసీపీ ప్రజలపై కక్ష తీర్చుకోవాలన్నట్టు వ్యవహరిస్తోందని విమర్శలు
సీఎం చంద్రబాబు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్వాకాల వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని విమర్శించారు. బుడమేరు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేశారని, అందువల్లే వరదలు ముంచెత్తాయని అన్నారు. 

ఐదేళ్ల దుర్మార్గమైన పాలన కారణంగా 6 లక్షల మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. కాగా, విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు అనేకమంది ముందుకొస్తుండడం శుభపరిణామం అని చంద్రబాబు పేర్కొన్నారు. 

కొందరు ఆర్థిక రూపేణా సాయం చేస్తున్నారని, మరకొందరు ఆహారం అందిస్తున్నారని, ఇంకొందరు ఇతర రూపాల్లో సాయం అందిస్తున్నారని వివరించారు. కానీ వైసీపీ మాత్రం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

తమను ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తోందని, కృష్ణా నదికి వరద పోటెత్తుతున్న వేళ నదిలో మూడు పడవలు వదిలిపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. ఈ పడవలు కౌంటర్ వెయిట్లకు తగిలాయి కాబట్టి సరిపోయిందని, అలాకాకుండా, బ్యారేజి కాలమ్ ను ఢీకొట్టి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని వివరించారు. ఆ పడవలు వదిలిపెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

Go Back to Shorts
Chandrababu
Budameru
Breaches
Vijayawada
TDP
YSRCP

More Telugu News