సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 28 వేల మంది విద్యార్థులకు ఆహారం అందించే భారీ వంటశాల

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మెగా వంటశాల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 28 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. 

ఇవాళ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో పైలట్ ప్రాజెక్టుగా ఓ సెమీ రెసిడెన్షియల్ స్కూలు స్థాపించడంపై రేవంత్ రెడ్డితో చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. 

దీనిపై సీఎంవో వర్గాలు స్పందించాయి. భారీ వంటశాలకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికే కొడంగల్ లో మొదలయ్యాయని వెల్లడించాయి. కాగా, ఈ భారీ వంటశాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సాయంతో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహించనుంది. 

ఈ వంటశాల పూర్తయ్యాక కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ స్కూలు కూడా ప్రారంభించనున్నారని సీఎంవో వర్గాలు వివరించాయి.

Centralised Kitchen
Kodangal
Revanth Reddy
Hare Rama Hare Krishna
Congress
Telangana

More Telugu News