రాష్ట్ర విభజనకు జగన్ కారణం: చింతా మోహన్

ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందంటూ ఏపీ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు జగన్ కారణమని, కాంగ్రెస్ పార్టీ కారణం కాదని అన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని జగన్ బలహీనపరిచారని చెప్పారు. తిరుమలలో గత ఐదేళ్లుగా ఇచ్చిన బ్రేక్ దర్శనం వివరాలను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద చింతా మోహన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తాను ఎంపీగా ఉన్న సమయంలో... అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తాను తిరుపతిలో క్రికెట్ స్టేడియం కోసం పునాదిరాయి వేశామని... క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చింతా మోహన్ కోరారు. తిరుపతిలోని 10 ప్రాంతాల్లో పిల్లల కోసం ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జూపార్క్ ను వడమాలపేటకు తరలించి... టీటీడీ ఉద్యోగులకు అక్కడ స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.


More Telugu News