లండన్ ఆసుపత్రిలో మాజీ క్రికెటర్... బీసీసీఐ ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు!

Sandeep Patil requests BCCI to finance Anshuman Gaekwad medical expenses
  • లండన్ కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న అన్షుమన్ గైక్వాడ్
  • బీసీసీఐ నుంచి సాయం కావాలని విజ్ఞప్తి చేసిన సందీప్ పాటిల్
  • బీసీసీఐ నుంచి తనకు ఆర్థిక సాయం అందిందని... మరింత కావాలని అన్షుమన్ చెప్పారని వెల్లడి
భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ లండన్ ఆసుపత్రిలో ఉన్నారని... ఆర్థిక సాయం కోసం చూస్తున్నారని భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. 

బీసీసీఐ నుంచి తనకు ఆర్థిక సాయం అందినట్లు గైక్వాడ్ చెప్పారని, కానీ మరింత డబ్బు అవసరం ఉన్నట్లు తనతో చెప్పాడని సందీప్ పాటిల్ వెల్లడించారు. విషయం తెలియగానే దిలీప్ వెంగ్‌సర్కార్‌తో కలిసి తాను బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అన్షుమన్‌ను ఆసుపత్రిలో చూసిన తర్వాత తాము షెలార్‌కు ఫోన్ చేశామన్నారు.

తమ అభ్యర్థనకు ఆయన సానుకూలంగా స్పందించారని, అలాగే ఇతర మాజీ క్రికెటర్లు కూడా నిధుల కోసం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. బోర్డ్ నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. అన్షుమన్ ప్రాణాలు కాపాడుతాడని భావిస్తున్నట్లు చెప్పారు.

ఏ దేశానికి చెందిన క్రికెటర్ అయినప్పటికీ ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సహాయం అందించాలన్నారు. అన్షుమన్ విషయాన్ని బీసీసీఐ మరింత ప్రాధాన్య అంశంగా చూడాలని సందీప్ పాటిల్ అన్నారు. అన్షుమన్ గైక్వాడ్ 1974-87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత టీమిండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పని చేశాడు.
Go Back to Shorts
BCCI
Cricket
Crime News
London

More Telugu News