ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: బొత్స సత్యనారాయణ
- ప్రజాసేవకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటామని హామీ
- పేదలకు మేలు జరిగేలా ప్రభుత్వం పాలించాలని ఆకాంక్ష
- మాకంటే మెరుగైన పాలన ప్రజలు కోరుకోవడం వల్లే ఓడిపోయామన్న వైసీపీ నేత
- గురువారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాజీ మంత్రి
ప్రభుత్వంలో ఎవరు ఉన్నా సరే ప్రజలకు ఎలా మేలు చేయాలనే ఆలోచించాలని బొత్స చెప్పారు. వైసీపీ కన్నా మెరుగైన పాలన, సంక్షేమాన్ని ప్రజలు కోరుకున్నారని వివరించారు. ప్రజల ఆకాంక్షలను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని, వాటిని అందుకునేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం మారితే తమ జీవన విధానం మరింత మెరుగుపడుతుందేమోనని ప్రజలు భావించి ఉండొచ్చని, అదే తమ ఓటమికి కారణమని అనుకుంటున్నట్లు వివరించారు. అది నిజం కావాలని, కొత్త ప్రభుత్వానికి ఆ శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐదేళ్ల పాలనలో తాము చేశామంటున్న తప్పులను కొత్త ప్రభుత్వం సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా విజయనగరం జిల్లా ప్రజలకు, ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
మెగా డీఎస్సీ ప్రకటనకు సంబంధించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాటలను ప్రస్తావిస్తూ.. ఆ స్థాయిలో ఖాళీలు లేక మెగా డీఎస్సీ ప్రకటించలేకపోయామని బొత్స వివరించారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ప్రకటిస్తే తాము కూడా సంతోషిస్తామని చెప్పారు. అల్టిమేట్ గా ప్రజలకు, నిరుద్యోగులకు, పేదలకు మేలు కలగడమే తమకు కావాలని చెప్పారు. చివరగా.. అధికార బాధ్యతల వల్ల మీడియా మిత్రులను అరుదుగా కలిశామని, ఇకపై అప్పుడప్పుడూ కలుసుకుందామంటూ బొత్స సత్యనారాయణ చెప్పారు.