Telangana: హైకోర్టు ఆదేశాలతో మళ్లీ తెరుచుకున్న జీవన్ రెడ్డి మాల్

jeevan reddy mall reopened after high court order
  • దీనిపై ‘ఎక్స్’ వేదికగా పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 
  • వారంలోగా  రూ. 2.51 కోట్ల అద్దె బకాయిలను ఆర్టీసికి చెల్లించాలని కోర్టు ఆదేశించిందని వెల్లడి
  • ఒకవేళ చెల్లించకుంటే కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని స్పష్టీకరణ

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరుకు చెందిన బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ మళ్లీ తెరుచుకుంది.

బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ లీజుకు ఇచ్చిన స్థలంలో మాల్ నిర్మించిన జీవన్ రెడ్డి తమకు బకాయిలు చెల్లించలేదంటూ ఆర్టీసీ ఇటీవల దాన్ని మూసేయగా మాజీ ఎమ్మెల్యే కోర్టుకెక్కారు.

దీంతో మాల్ లోని సబ్ లీజుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని తిరిగి తెరవాలని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థకు పెండింగ్‌లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని మాల్ యాజమాన్య సంస్థ విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు.

 ఒకవేళ గడవులోగా బకాయిలు చెల్లించకపోతే నోటీసు ఇవ్వకుండానే మాల్ ను తిరిగి తాము స్వాధీనం చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు. 

అందుకే హైకోర్టు ఆదేశాల మేరకు సబ్‌ లీజ్‌ దారులను దృష్టిలో ఉంచుకొని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం అనుమతి ఇచ్చామని సజ్జనార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News