దేశంలో రేపు ఐదో విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

All set for fifth phase polling in India
  • దేశంలో ఈసారి 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు
  • ఇప్పటివరకు 4 దశల్లో 379 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తి
  • మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో దశ పోలింగ్
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇక, రేపు (మే 20) దేశంలో ఐదో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 

ఐదో విడతలో భాగంగా 6  రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 1, లడఖ్ లో 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 

ఐదో విడత బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్, పియూష్ గోయల్, బీజేపీ అధికార రాజీవ్ ప్రతాప్ రూడీ, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు పోటీ చేస్తున్నారు. 

ఇప్పటివరకు జరిగిన 4 దశల పోలింగ్ తో 379 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న ఆరో దశ, జూన్ 1న ఏడో విడత పోలింగ్ తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Go Back to Shorts
Fifth Phase Polls
General Elections
India

More Telugu News