EC: సరిగ్గా పోలింగ్ ముందే ఎందుకు నిధులు విడుదల చేయాలనుకుంటున్నారు?: ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈసీ

EC questions AP Govt on funds release
  • ఏపీ ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలపై ఈసీ లేఖ
  • బటన్ నొక్కి చాలారోజులైనా ఇప్పటివరకు ఎందుకు విడుదల చేయలేదన్న ఈసీ
  • ఇప్పుడు విడుదల చేయకపోతే ఏమైనా అవుతుందా అంటూ ప్రశ్న

ప్రభుత్వ పథకాలకు నగదు బదిలీ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. ఎప్పుడో బటన్ నొక్కి పోలింగ్ తేదీకి ముందు నిధులు ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ రోజే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. 

జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని ఆదేశించింది. ఇప్పటివరకు నిధుల విడుదల చేయకపోవడానికి కారణాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. 

ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య వ్యవధి ఎంత అనే విషయం కూడా స్పష్టం చేయాలని ఈసీ నిర్దేశించింది. బటన్ నొక్కి చాలా రోజులైంది... ఇవాళే నిధులు జమ కాకపోతే ఏమైనా అవుతుందా? అని ప్రశ్నించింది. నిధుల జమకు ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల కోడ్ వల్ల ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

బటన్ నొక్కిన కొన్ని వారాల పాటు నిధుల విడుదలను ఆపి, ఇప్పుడు పోలింగ్ ముందు రోజే జమ చేయకపోతే ఏమవుతుంది? ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమైందా? ఒకవేళ అలా నిర్ణయమై ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వండి అని కోరింది. మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News