ఏటీఎం సెంటర్లలో కొత్తరకం మోసం.. ఢిల్లీ పోలీసుల అలర్ట్
- మెషిన్ లో కార్డు ఇరుక్కుపోయేలా చేసి డబ్బు కాజేస్తున్న ముఠా
- ముఠాలో కొంతమందిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
- నగదు విత్ డ్రా చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని హితవు
మెషిన్ లో కార్డు ఇరుక్కునేలా చేసి..
సెక్యూరిటీ గార్డులేని ఏటీఎం సెంటర్ ను ఎంచుకుని నేరస్థులు ఈ కొత్తరకం మోసానికి పాల్పడుతున్నారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. తమ మోసం రికార్డు కాకుండా ఏటీఎం సెంటర్ లోని సీసీటీవీ కెమెరాలపై రంగును స్ప్రే చేస్తారు. ఆపై ఏటీఎం మెషిన్ లోని కార్డ్ రీడర్ ను తొలగిస్తారు. ఆపై నగదు విత్ డ్రా చేసేందుకు వచ్చే వాళ్ల కోసం చుట్టుపక్కల కాలక్షేపం చేస్తుంటారు. ఏటీఎం సెంటర్ లోకి కస్టమర్ అడుగుపెట్టగానే తాము కూడా నగదు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చినట్లు అక్కడికి చేరుకుంటారు. మెషిన్ లో ఇరుక్కున్న కార్డును తీయడానికి సాయం చేస్తామంటూ ముందుకొచ్చి, ఏటీఎం పిన్ ఎంటర్ చేసి చూడాలని సలహా ఇస్తారు. కస్టమర్ ఎంటర్ చేసిన పిన్ నెంబర్ గుర్తుంచుకుంటారు. ఎంత ప్రయత్నించినా కార్డు రాకపోవడంతో బ్యాంకును సంప్రదించాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. చేసేదేంలేక కస్టమర్ వెళ్లిపోగానే తిరిగి వచ్చి కార్డును తీసుకుని వేరే ఏటీఎంకు వెళ్లి నగదు డ్రా చేసుకుంటారు.
జన సంచారం లేనిచోట జాగ్రత్త..
ఏటీఎం సెంటర్ చుట్టుపక్కల జన సంచారం లేని చోట ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి చోట నగదు విత్ డ్రా చేసే ప్రయత్నం కూడదని పోలీసులు సూచించారు. రాత్రిపూట మరింత జాగ్రత్తగా ఉండాలని, వెలుతురు బాగా ఉన్న ఏటీఎంలలోనే నగదు విత్ డ్రా చేసుకోవాలని చెప్పారు. ఏటీఎం సెంటర్ లోపలకు అడుగుపెట్టాక ఒకసారి అక్కడి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని, అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మరో ఏటీఎంకు వెళ్లాలని సూచించారు. ఏటీఎం మెషిన్ తెరిచినట్లు కనిపించినా, మెషిన్ లో నుంచి ఏవైనా వైర్లు కనిపించినా ఆ ఏటీఎంను వినియోగించ వద్దని చెప్పారు. ఏటీఎం రద్దీగా ఉన్న సందర్భాలలో మీ పిన్ నెంబర్ ఇతరులు చూసే అవకాశం ఉంటుందని, నెంబర్ ఎంటర్ చేసేటపుడు ఇతరులకు కనిపించకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఇతరుల సాయం తీసుకోకుండా ఉండడం మేలు, తప్పనిసరి పరిస్థితుల్లో పిన్ నెంబర్, కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ లను, బ్యాంక్ స్టేట్ మెంట్ లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని పోలీసులు వివరించారు.