Revanth Reddy: మోదీ ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy says Modi government is not giving funds to telangana
  • హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ
  • రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లలో గెలిపించాలని అడుగుతోందని వ్యాఖ్య
ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక కర్ణాటకకు చెంబు, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు ఈ గుడ్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన భూపాలపల్లి జనజాతర సభలో మాట్లాడుతూ... అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు.

వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు రాకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు. హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లలో గెలిపించాలని అడుగుతోందన్నారు. రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు.

సాధారణంగా సీతారాముల కల్యాణం చేసిన తర్వాత అక్షితలు ఇస్తారని, కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షితలు పంచారని మండిపడ్డారు. రాముడిని బీజేపీ అవమానించిందన్నారు. తామంతా రాముని భక్తులమేనని స్పష్టం చేశారు. తమకంటే గొప్ప హిందువులు ఉన్నారా? అని ప్రశ్నించారు. హిందువులను తాము ఓటు బ్యాంకులాగా ఉపయోగించుకునేది లేదన్నారు.
Revanth Reddy
Congress
BJP
Telangana
Lok Sabha Polls

More Telugu News