నీట్ రీ-టెస్ట్: టెలిగ్రామ్పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
- నీట్ రీ-టెస్ట్కు ముందు తాత్కాలిక నిషేధం
- జూన్ 30 వరకు మెసేజ్ ఎడిట్ ఫీచర్ నిలిపివేత
- ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్న ఎన్టీఏ
- కోట్లాది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని టెలిగ్రామ్ వాదన
- అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకారం
నీట్ రీ-టెస్ట్ జూన్ 21న జరగనుంది. పరీక్షకు ముందు ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు సమాచార ప్రచారాన్ని అడ్డుకునేందుకు టెలిగ్రామ్పై 24 గంటల పాటు నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే ముఠాలు, పరీక్షల్లో అక్రమాలకు సహకరించే నెట్వర్క్లను అడ్డుకోవడమే ఈ చర్యల లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో జూన్ 30 వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిట్ చేసే సదుపాయాన్ని కూడా నిలిపివేయాలని సంస్థను ఆదేశించారు.
మెసేజ్లను తర్వాత సవరించే సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఏ ఆరోపిస్తోంది. పరీక్ష పూర్తైన తర్వాత ప్రశ్నపత్రాలను పాత సందేశాల్లో చేర్చి, అవి ముందుగానే లీకైనట్లు చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. దీంతో పరీక్షల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయని పేర్కొంది.
మరోవైపు టెలిగ్రామ్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొందరి తప్పిదాల కారణంగా కోట్లాది మంది సాధారణ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయడం సరైన విధానం కాదని వాదిస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ స్పందిస్తూ.. ప్రశ్నపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఇలాంటి ఆంక్షల వల్ల లీకేజీలు ఆగిపోవని, అవి మరో వేదికకు మారే అవకాశమే ఎక్కువని వ్యాఖ్యానించారు.