నల్గొండలో ప్రమాదం.. సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం

  • బుధవారం సాయంత్రం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై జిల్లా కేంద్రం వద్ద ప్రమాదం
  • రఘుబాబు డ్రైవ్ చేస్తున్న కారు బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి జనార్దన్‌రావును ఢీకొట్టిన వైనం
  • తీవ్రగాయాలపాలైన బాధితుడు ఘటనా స్థలంలోనే మృతి
  • మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
  • రఘుబాబును అరెస్టు చేసిన అనంతరం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొనడంతో బీఆర్ఎస్ నాయకుడు సందినేని జనార్దన్‌రావు దుర్మరణం చెందారు. నార్కట్‌పల్లి -అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బీఆర్ఎస్ నల్గొండ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దనరావు(48) అక్కడి శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. 

బుధవారం సాయంత్రం జనార్దనరావు వాకింగ్ కోసం సమీప లెప్రసీ కాలనీలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి బైక్‌పై బయలుదేరారు. వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారును స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు..వెనక నుంచి బైక్‌ను ఢీకొన్నారు. దీంతో, జనార్దన్‌రావు ఎగిరి డివైడర్ పై పడ్డారు. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు చెప్పారు.

Nalgonda District
Raghubabu
Tollywood
Road Accident
BRS

More Telugu News