హడలెత్తిస్తున్న వడగాలులు.. జైలు నుంచి ఆంగ్‌సాన్ సూకీ తరలింపు

మయన్మార్ జైలులో మగ్గుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మాజీ నేత ఆంగ్‌సాన్ సూకీ విషయంలో సైనిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండలు ముదిరి తీవ్రమైన వడగాలులు వీస్తుండడంతో సూకీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జైలు నుంచి ఆమెను హౌస్ అరెస్ట్‌కు తరలించారు. తీవ్రమైన వడగాలుల నుంచి రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సైన్యం పేర్కొంది. అవసరమైన అందరికీ ముఖ్యంగా జైలులో ఉన్న వృద్ధుల రక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టినట్టు తెలిపింది.

ఇందులో భాగంగా సూకీతోపాటు అధ్యక్షుడు యు విన్ మియింట్(72)ను జైలు నుంచి తరలించారు. అయితే, వారిని ఎక్కడ ఉంచారన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. మియంట్ టౌంగూలో 8 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మయన్మార్‌ రాజధాని నైఫిడాలో నిన్న 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, సూకీ, మియంట్‌కు విధించిన శిక్షలపై తీవ్రంగా స్పందించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. మానవ హక్కుల నిపుణులు కూడా వారిపై పెట్టిన కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు.

Aung San Suu Kyi
U Win Myint
Myanmar
Myanmar Military
Heatwaves
Summer

More Telugu News