Kerala: ఈవీఎంల ట్యాంపరింగ్ కోసం లాక్‌డౌన్ విధిస్తారంటూ ఫేక్ పోస్ట్.. నిందితుడి అరెస్ట్

  • లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారంటూ పోస్టు
  • కొవిడ్ లాక్‌డౌన్ నాటి న్యూస్ స్క్రీన్‌షాట్‌ను ఉపయోగించిన వ్యక్తి
  • నిందితుడిని పసిగట్టి అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు
Man shares propaganda post on social media and arrest in Kerala

లోక్‌సభ పోల్స్, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు లాక్‌డౌన్ ప్రకటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టిన కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మలప్పురం జిల్లాకు చెందిన ఎంవీ షరాఫుద్దీన్‌గా గుర్తించామని, అతడిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎంలను ట్యాంపర్ చేయబోతున్నారని, ఇందుకోసం దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తారని పోస్టులో పేర్కొన్నాడని వివరించారు.

నిందితుడు షరాఫుద్దీన్ ఫేక్ పోస్ట్ కోసం కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని ఉపయోగించాడని, న్యూస్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడని పోలీసులు వివరించారు. శుక్రవారం అతడిని అరెస్ట్ చేశామని చెప్పారు. కొచ్చి సైబర్‌డోమ్ బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.

కాగా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో ఫేక్‌ వార్తలపై కేరళ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సైబర్ విభాగం నేతృత్వంలో అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా పోస్టులపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. కాగా ఏప్రిల్ 26న కేరళలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News