Chandrababu: అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ మనతో చేయి కలిపారు: చంద్రబాబు

Chandrababu describes Pawan Kalyan wind force
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాడేపల్లిగూడెం సభలో ధ్వజమెత్తారు. విపక్ష నేతలను తిరగనివ్వకుండా చేసేందుకు, మీడియాను కంట్రోల్ చేయడం కోసం జీవో నెం.1 తీసుకువచ్చాడని, మీటింగులను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని విమర్శించారు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టి, ఎన్నికల తర్వాత పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి తీసుకువచ్చాడని అన్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అని అభివర్ణించారు. బ్లఫ్ మాస్టర్ అంటే పదే పదే అబద్ధాలు చెప్పడం, తాను చేయని పనులను చేశానని చెప్పుకునేవాళ్లు అని వివరించారు. పూర్వం రోజుల్లో కనికట్టు కట్టేవాళ్లు ఉండేవాళ్లు... అలాంటివాడే ఈ జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. 

కుప్పం ప్రజలెవరూ నీ మాటలు నమ్మరు జగన్!

నిన్ననే కుప్పంలో చూశారు. నా నియోజకవర్గం గురించి పేపర్లో వచ్చింది. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ముఖ్యమంత్రిగా చేశాను. కుప్పానికి నీళ్లు అంటూ నిన్న ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. 

నేరుగా కుప్పం వెళ్లాడు... ట్యాంకర్లలో నీళ్లు తీసుకెళ్లి కాలువల్లో వదిలాడు... గేట్లు కూడా పెట్టాడు. ఓ సినిమా సెట్టింగ్ ను తలపించేలా చేశాడు. నీళ్లు వదిలిపెట్టి వచ్చాడు... కానీ తెల్లవారితే నీళ్లు లేవు అక్కడ. కేవలం 23 గంటల్లో అంతా ముగిసింది. ఇదీ ఈ ముఖ్యమంత్రి విశ్వసనీయత. ఇవాళ తాడేపల్లిగూడెం నుంచి చెబుతున్నా... కుప్పంలో నాకు లక్ష మెజారిటీ ఖాయం... నీ మాటలు కుప్పం ప్రజలెవరూ నమ్మరు. 

అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ ఉండదు. ఇక 40 రోజులే మిగిలుంది... వైసీపీ రౌడీలకు 40 రోజుల తర్వాత రియల్ సినిమా చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాం. టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్. నీ కుట్రలు, నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్... విధ్వంసాలకు ఫుల్ స్టాప్. టీడీపీ-జనసేన కూటమి ఒక విన్నింగ్ టీమ్... వైసీపీ ఒక ఛీటింగ్ టీమ్. అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కల్యాణ్ మనతో చేయి కలిపారు. అగ్నికి వాయువు తోడైతే వైసీపీ బుగ్గి అయిపోతుంది.

ప్రజల్లో ఉండే వాళ్లే మా అభ్యర్థులు


ఎన్నికల నేపథ్యంలో ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాం. 1.30 కోట్ల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసి, ప్రజల్లో ఉండే వాళ్లనే గుర్తించి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాం. మా అభ్యర్థులను చూశాక జగన్ లో భయం మొదలైంది. మళ్లీ అభ్యర్థులను మార్చుతానంటున్నాడు. మన అభ్యర్థులు విద్యావంతులు, పేరున్న వాళ్లు... జగన్ అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు. వైసీపీ అభ్యర్థులు మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో ఎవరికీ రక్షణ ఉండదు. మాఫియా నేతలు కావాలా, ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులు కావాలా?

అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇస్తాం. ఎస్టీల కోసం ఆలోచిస్తాం, మహిళల కోసం ప్రకటన చేస్తాం, రైతుల కోసం ఆలోచిస్తాం, ఉద్యోగులకు కూడా న్యాయం చేస్తాం. త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం.
Go Back to Shorts
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena
Andhra Pradesh

More Telugu News