జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదాలు.. 10 మంది దుర్మరణం

  • మరో 14 మందికి తీవ్ర గాయాలు
  • లోయలోకి ప్రయాణికుల వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి
  • స్నోకటర్ వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరి మృతి
  • మృతులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం
జమ్మూకశ్మీర్‌లో నిన్న జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బారాముల్లా, కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదాల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని ఉరి ప్రాంతంలో ప్రయాణికుల వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు.

కిష్త్వార్‌లోని వార్వాన్ ప్రాంతంలో రహదారి పనుల్లో ఉన్న స్నోకటర్ వాహనం ప్రమాదానికి గురికావడంతో మరో ఇద్దరు మృతి చెందారు.  మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ దివాన్స్ యాదు తెలిపారు.  రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.

Road Accident
Jammu And Kashmir
Kishtwar
Baramulla

More Telugu News