VV Lakshminarayana: ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ... అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ

ఏపీలో ఇటీవలే పురుడు పోసుకున్న కొత్త పార్టీ... జై భారత్ నేషనల్ పార్టీ. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ పార్టీ స్థాపించారు. ఉద్యోగ విరమణ తర్వాత కొన్నాళ్ల పాటు సామాజిక అధ్యయనం చేసిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జనసేనలో చేరారు. కొంత కాలానికే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు. ఇటీవలే ఆయన జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఇక, ఏపీలో త్వరలోనే ఎన్నికల ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో, లక్ష్మీనారాయణ ఎన్నికల సమర శంఖం పూరించారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తమ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం... టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారని తెలిపారు. 

మరో మూడ్రోజుల్లో తమ పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అభివృద్ధే ప్రధానంగా... ఉపాధి, రైతుల సంక్షేమం కోణంలో తమ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. ఇవాళ లక్ష్మీనారాయణ కోనసీమ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ వివరాలు తెలిపారు.
VV Lakshminarayana
Jai Bharat Party
Elections
Andhra Pradesh

More Telugu News