టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

  • ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో రాజీనామాల ఆమోదం
  • న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై
  • కొత్త కమిషన్ ఏర్పాటు కోసం... పలువురి పేర్లను పరిశీలిస్తోన్న ప్రభుత్వం
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించారు. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని... చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం... చైర్మన్, సభ్యుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది.

సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచన

గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి... గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్‌లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు. తాజాగా గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు.

Governor
Tamilisai Soundararajan
Telangana
tspsc

More Telugu News