క్రికెట్ లో కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ
- స్టంప్ ఔట్ అప్పీల్ వ్యవహారంలో కీలక మార్పులు
- ఇకపై స్టంపింగ్ ను మాత్రమే చెక్ చేయనున్న థర్డ్ అంపైర్
- గతంలో క్యాచ్ ఔట్ ను చెక్ చేసి, ఆపై స్టంప్ ఔట్ పరిశీలన
కీపర్ స్టంప్ ఔట్ కు అప్పీల్ చేసినపుడు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ రిఫరెన్స్ కోరుతుంటారు. ఈ అప్పీల్ ను పరిశీలించే క్రమంలో థర్డ్ అంపైర్ ముందు బంతి బ్యాట్ ను తాకిందా (క్యాచ్ ఔట్) లేదా అనేది చూస్తారు. ఒకవేళ బంతి బ్యాట్ ను తాకితే క్యాచ్ ఔట్ ఇస్తారు. తాకకుంటే స్టంప్ ఔట్ అప్పీల్ ను పరిశీలిస్తారు. ఒక్క అప్పీల్ తో క్యాచ్, స్టంప్ ఔట్ లు రెండింటినీ పరిశీలించే అవకాశం కలుగుతోంది.
ఈ నిబంధనను ఉపయోగించుకుని ఫీల్డింగ్ జట్లు ప్రయోజనం పొందుతున్నాయి. ఈ క్రమంలోనే నిబంధనలలో మార్పులు చేస్తూ ఐసీసీ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. స్టంప్ ఔట్ అప్పీల్ వచ్చినపుడు కేవలం స్టంపింగ్ ను మాత్రమే పరిశీలించేలా రూల్స్ సవరించింది. క్యాచ్ ఔట్ కోసమైతే కీపర్ విడిగా అప్పీల్ చేసుకోవాలని ఐసీసీ పేర్కొంది.