Nandamuri Vasundhara: జిరాక్స్ యంత్రం కోసం బాలకృష్ణ గారు బ్రాహ్మణిని దాదాపు డిమాండ్ చేశారు: వసుంధర

Nandamuri Vasundhara attends programs in Hindupur constituency
షార్ట్స్‌లో చూడండి
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అర్ధాంగి వసుంధర ఇవాళ నియోజకవర్గంలో పర్యటించారు. పలు హైస్కూళ్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లేపాక్షి మండలం శిరివరం జిల్లా పరిషత్ హైస్కూల్, చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి హైస్కూల్ లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. హెరిటేజ్ సంస్థ సహకారంతో ఆయా హైస్కూళ్లకు రూ.8 లక్షల విలువైన వస్తువులను అందించారు. విద్యార్థులకు జ్ఞాపికలు, మెడల్స్ బహూకరించారు. 

ఈ సందర్భంగా నందమూరి వసుంధర మాట్లాడుతూ, విద్యార్థులందరినీ చూస్తుంటే బాల్యంలో తాను చదువుకున్నప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల ముఖాల్లో తేజస్సు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, భవిష్యత్తులో వారు కూడా అబ్దుల్ కలాం, జగదీశ్ చంద్రబోస్, చంద్రయాన్ శాస్త్రవేత్తల తరహాలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. హిందూపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. 

దేమకేతేపల్లి పాఠశాలకు జిరాక్స్ యంత్రం అత్యవసరమని తెలియడంతో బాలకృష్ణ గారు బ్రాహ్మణిని దాదాపుగా డిమాండ్ చేశారని వసుంధర వెల్లడించారు. దాంతో బ్రాహ్మణి వెంటనే స్పందించి జిరాక్స్ యంత్రం సమకూర్చినట్టు వివరించారు. ఇదే కాకుండా, భవిష్యత్తులోనూ ఈ పాఠశాలకు మరింత సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nandamuri Vasundhara
Hindupur
Balakrishna
Nara Brahmani
Heritage
TDP
Andhra Pradesh

More Telugu News