KTR: కేటీఆర్‌ను చూసి పిప్పర్‌మెంట్లు కొనమని సైగ చేసిన వృద్ధుడు.. ఆప్యాయంగా పలకరించి కొనుగోలు చేసిన మంత్రి!

BRS leader KTR buy chocolates from old man
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో నిన్న జరిగిన తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో అరుదైన దృశ్యం కనిపించింది. స్టేజీపై ఉన్న మంత్రి కేటీఆర్ ఓ పెద్దాయన వద్ద పిప్పర్‌మెంట్లు కొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మంత్రి స్వయంగా తనను పిలిచి పలకరించడంతో ‘నేను మీకు తెలుసా సార్’ అని ఆశ్చర్యం, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ప్రశ్నించాడా వృద్ధుడు. 

పిప్లర్‌మెంట్లు అమ్ముకునే ఆ వృద్ధుడి పేరు సత్యనారాయణ. హైదరాబాద్‌లో ఇలాంటి సమావేశాలు ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోతుంటాడు. అక్కడ పిప్పర్‌మెంట్లు, చాక్లెట్లు అమ్ముకుని జీవిస్తూ ఉంటాడు. అలాగే, శనివారం న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి కూడా వచ్చాడు. కేటీఆర్‌ను చూసి సరదాగా సైగ చేసి పిప్పర్‌మెంట్లు తీసుకోవాలని కోరాడు. 

మంత్రి వెంటనే స్టేజీపై నుంచి ముందుకు వచ్చి సత్యనారాయణ వద్ద పిప్పర్‌మెంట్లు కొన్నారు. ‘బాగున్నారా?’ అని చిరునవ్వుతో పలకరించారు. దీంతో ఆశ్చర్యపోయిన వృద్ధుడు.. ‘నేను మీకు తెలుసా సార్’ అని ప్రశ్నించాడు. మీరిలా పిప్పర్‌మెంట్లు అమ్ముతుండగా ఇది వరకు చూశానని మంత్రి బదులిచ్చారు. అనంతరం ఆ వృద్ధుడి వివరాలు తెలుసుకుని చెప్పాలంటూ సిబ్బందికి పురమాయించారు. తాను ఒంటరివాడినని, పాతబస్తీలో ఉంటానని, తనకు ఇల్లులేదని సత్యనారాయణ తెలిపారు. ఇలా తిరగడం కష్టంగా ఉందని చిన్న షాపు పెట్టుకోవడానికి తనకు సాయం చేయాలని కోరాడు.
Go Back to Shorts
KTR
BRS
Hyderabad

More Telugu News