‘నన్ను అంతమొందించే కుట్ర జరుగుతోంది’.. ఏసీబీ జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు
- తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి వామపక్ష తీవ్రవాదుల లేఖ
- ఇప్పటి వరకూ దానిపై విచారణ చేపట్టలేదని జడ్జికి వెల్లడించిన చంద్రబాబు
- జైలులోకి వచ్చినపుడు తనను వీడియో తీసి ఆ ఫుటేజీని పోలీసులే లీక్ చేశారని ఆరోపణ
జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న తనను జైలులోపలికి వెళుతుండగా అనధికారికంగా పోలీసులు వీడియో తీశారని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. ఆ వీడియో ఫుటేజీని స్వయంగా పోలీసులే లీక్ చేశారని, తన గౌరవాన్ని, ప్రజల్లో తనపై ఉన్న అభిమానాన్ని పోగొట్టేందుకే ఈ ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు (తన) ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని తూర్పు గోదావరి ఎస్పీకి ఇప్పటికే ఓ లేఖ కూడా వచ్చిందని చెప్పారు. అయితే, ఈ లేఖపై ఇప్పటికీ విచారణ జరిపించలేదని వివరించారు.
జైలు లోపల తన కదలికలపై డ్రోన్లతో నిఘా పెడుతున్నారని, జైలు ఆవరణలో డ్రోన్లను ఎగరవేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఓ ముద్దాయి పెన్ కెమెరాతో వీడియోలు తీస్తున్నారని, తన కుటుంబ సభ్యులతో ములాఖత్ అయినపుడు కూడా డ్రోన్లను ఎగరవేస్తున్నారని చెప్పారు. తనతో పాటు తన కుటుంబానికీ ముప్పు పొంచి ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గార్డెనింగ్ పనులు చేస్తున్న ఖైదీల వద్దకు గంజాయి ప్యాకెట్లు విసిరేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.